

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో విధానపరమైన ఏకరూపత సాధించడంతోపాటు పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఖైరతాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ‘ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత-సవాళ్లు, పరిష్కారాలు’ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సును గురువారం గవర్నర్ ప్రారంభించి ప్రసంగించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఇన్ ఇండియా (ఎన్ఎఫ్ఐసీఐ), దిల్లీ ఆధ్వర్యంలో తెలంగాణ సమాచార కమిషన్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం ప్రజల ఆస్తి అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించడం ప్రభుత్వ బాధ్యత అని గవర్నర్ అన్నారు.
ఎన్ని ఆర్టీఐ దరఖాస్తులు, అప్పీళ్లను పరిష్కరించామన్నది విజయానికి కొలమానం కాదని, ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఎంత పెరిగిందన్నదే అసలైన విజయమని శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. దేశంలోని సమాచార కమిషన్లు తమ ఉత్తమ విధానాలు, విజయవంతమైన ప్రయోగాలు, అనుభవాలను పరస్పరం పంచుకునేలా బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సదస్సులో కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ ఆర్.కె. గోయల్, ఏఎస్సీఐ ఛైర్మన్ కె. పద్మనాభయ్య, డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. రమేశ్కుమార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాచార కమిషన్ రూపొందించిన ‘తెలంగాణ ట్రాన్స్పరెంట్ టైమ్స్-సమాచార దర్పణం’ న్యూస్లెటర్ను గవర్నర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి. చంద్రశేఖర్రెడ్డితో పాటు వివిధ రాష్ట్రాల ప్రధాన సమాచార కమిషనర్లు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!