

కర్ణాటకలోని బాగల్కోట్ ఎమ్మెల్యే ఉమేశ్ మేటి మేనకోడలు డాక్టర్ అంకిత యారగల్ వివాదంలో చిక్కుకున్నారు. బాగల్కోట్లోని వాంబే కాలనీలో ఉన్న నమ్మ క్లినిక్లో వైద్యాధికారిగా పనిచేస్తున్న ఆమె.. విధులకు హాజరు కాకుండానే నెలకు రూ.70,000కు పైగా జీతం తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మార్చి నుంచి నమ్మ క్లినిక్ విధులకు ఆమె గైర్హాజరైనట్లు వచ్చిన ఆరోపణలపై బాగల్కోట్ జిల్లా పంచాయతీ సీఈఓ గజానన్ బలే విచారణకు ఆదేశించారు.
తొలి విచారణకు డాక్టర్ అంకిత హాజరు కాకపోవడంతో సెప్టెంబర్ 18న మరోసారి విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసు జారీ చేశారు. ఆ రోజూ హాజరు కాకపోతే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే ఆమెకు చెల్లించిన జీతాన్ని తిరిగి రికవరీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, బాగల్కోట్ జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు ఆమెను విధుల నుంచి తొలగించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆమె తండ్రి, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ రాజ్కుమార్ యారగల్.. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమెకు జీతం చెల్లించలేదని, ఆమె నియామకం తనకు ముందు ఉన్న అధికారి హయాంలో జరిగిందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!