

భూసేకరణ, పునరావాసం కోసం ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయి భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసిత కుటుంబాల ఖాతాల్లోకే చేరాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్ల పీడీ ఖాతాల్లో నిధులు జమ చేయడంతో ప్రభుత్వ బాధ్యత పూర్తయినట్లు కాదని, లబ్ధిదారులకు డబ్బులు చేరినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్లో భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ అనుమతులు, చెల్లింపుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. అవసరమైన పత్రాలు, లబ్ధిదారుల వివరాలు పూర్తిగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి రెండు రోజుల్లోనే పరిహారం రైతులు, నిర్వాసితుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు.
భూసేకరణ, ఆర్అండ్ఆర్ అవసరాల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2,782 కోట్లు విడుదల చేయగా, సుమారు రూ.566 కోట్లు లబ్ధిదారులకు చేరినట్లు సమీక్షలో వెల్లడైంది. మరో రూ.989 కోట్లు వివిధ దశల్లో చెల్లింపుల ప్రక్రియలో ఉండగా, రూ.199 కోట్లు జిల్లాల వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ పంపిణీ ప్రారంభం కావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
దాదాపు రూ.1,200 కోట్లను తక్షణమే లేదా స్వల్ప పరిపాలనా ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారులకు అందించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని అత్యవసరంగా రైతులు, నిర్వాసితుల ఖాతాల్లోకి జమ చేయాలని ఆదేశించారు. జగిత్యాల, సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని భూసేకరణ సమస్యలను కూడా ఆయన సమీక్షించారు. కన్సెంట్ అవార్డులు, పరిహారం ప్రక్రియను వేగవంతం చేసి ప్రాజెక్టుల పనులు ఆలస్యం కాకుండా చూడాలని సూచించారు.
అటవీ అనుమతుల విషయంలోనూ శాఖల మధ్య సమన్వయ లోపంతో పనులు నిలిచిపోకూడదని మంత్రి స్పష్టం చేశారు. కలెక్టర్లు రెవెన్యూ, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులతో సంయుక్త సమావేశాలు నిర్వహించి పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!