

ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్కు అంతర్జాతీయ సమాజం అండగా నిలవాలని సీనియర్ నటి మనీషా కోయిరాలా భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. కాఠ్మాండూలో జన్మించిన ఆమె హిందీతో పాటు తెలుగులోనూ పలు ప్రముఖ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో మాట్లాడిన మనీషా.. నేపాల్ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల ప్రభావం నుంచి దేశం కోలుకోవాలంటే పర్యాటకులు మళ్లీ నేపాల్కు రావాల్సిన అవసరం ఉందన్నారు.
నేపాల్ను ఆదుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో విస్తృత సహకారం అవసరమని మనీషా కోయిరాలా పేర్కొన్నారు. ముఖ్యంగా పొరుగు దేశాలైన భారత్, చైనాలు ఆపత్కాలంలో మరింత సహాయం అందించాలని కోరారు. సహాయక చర్యలతో పాటు పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు ఇరు దేశాల సహకారం అవసరమని అన్నారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా ప్రకృతి విపత్తులు పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణలో పొరుగు దేశాల భాగస్వామ్యం కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!