

వియత్నాంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారిక సమాచారం ప్రకారం, రాష్ట్రం నుంచి మొత్తం 33 మంది వియత్నాం పర్యటనకు వెళ్లగా, వారిలో 19 మంది ప్రమాదానికి గురైన బోటులో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారిని సురక్షితంగా రక్షించారు. ఒకరు తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. విహారయాత్రకు వెళ్లి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని సీఎం పేర్కొంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాద పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాలా సహాయం అందించాలని ఆదేశించారు. ప్రాణాలతో బయటపడిన వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు వియత్నాం ప్రభుత్వ అధికారులతో, అక్కడి భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సీఎం ఆదేశించారు. అలాగే మృతి చెందిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!