

పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికా ఇరాన్పై భారీ సైనిక దాడులు చేసింది. క్షిపణి ప్రయోగ స్థావరాలు, సముద్రంలో మందుపాతరలు అమరుస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఇరాన్ దళాల నుంచి తమ నౌకలకు ముప్పు ఉందని భావించి స్వీయరక్షణలో భాగంగానే చర్యలు తీసుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. బందర్ అబ్బాస్ నౌకాదళ స్థావరం ధ్వంసమైందని, లర్క్ ద్వీపంలో కనీసం నలుగురు ఇరాన్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ కూడా పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. హెజ్బొల్లా లక్ష్యాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది.
ఈ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. చర్చలు జరుగుతున్న సమయంలో అమెరికా దాడులు చేయడం వంచన అని ఆరోపిస్తూ, దీనికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమాసియా ఇకపై అమెరికా సైనిక స్థావరాలకు రక్షణ కవచం కాదని ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అప్పగించేందుకు ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అదే సమయంలో అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ను కూల్చివేసినట్లు, ఎఫ్-35 యుద్ధ విమానంపై కాల్పులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ పరిణామాలతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!