

దిల్లీ, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో హెచ్1ఎన్1 ఇన్ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నప్పటికీ, వైరస్ కొత్తగా లేదా మరింత ప్రమాదకరంగా రూపాంతరం చెందుతున్నట్లు ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఐసీఎంఆర్ తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం భారత్లో వ్యాప్తిలో ఉన్న హెచ్1ఎన్1 వైరస్ ఇప్పటికే చలామణిలో ఉన్న సీజనల్ ఇన్ఫ్లుయెంజా రకమే. దిల్లీలో ఆగస్టు 20 నాటికి 1,777 హెచ్1ఎన్1 కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కూడా హెచ్1ఎన్1 కొత్త వైరస్ కాదని, ఇది సాధారణ కాలానుగుణ ఇన్ఫ్లుయెంజా కార్యకలాపాల్లో భాగమేనని తెలిపారు. అయితే వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతినొప్పి, స్పృహలో మార్పులు లేదా పెదాలు నీలిరంగులోకి మారడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!