

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరం యువత తెలుసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్తో కలిసి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ రచించిన ‘సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినము’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచందర్రావు మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్ర, ఉద్యమాలపై ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ విశేష రచనలు చేశారని, మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమ ఘనతను కొందరు తమకే ఆపాదించుకుంటున్నారని రామచందర్రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమాల్లో వివిధ వర్గాలు, మేధావులు, విద్యార్థులు, అధ్యాపకులు పోషించిన పాత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చరిత్రను సరళంగా, వాస్తవాలతో యువతకు అందించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!