

రాజీవ్ యువ వికాసం పథకం తొలి విడత కింద నవంబర్ 19 నుంచి లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలు, గురుకులాల నిర్వహణ, విద్యా మౌలిక వసతులు, స్వయం ఉపాధి, స్కాలర్షిప్లు, స్టడీ సర్కిళ్లపై సమావేశంలో చర్చించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను కార్యాలయాల్లోనే స్వీకరించి, కలెక్టర్ల సమక్షంలో లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని భట్టి సూచించారు.
గురుకులాల్లో కేంద్రీకృత యంత్రాల వంటశాలల ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామంతాపూర్ పబ్లిక్ స్కూల్, సంక్షేమ విద్యాసంస్థల్లో గత పదేళ్లుగా చదివిన విద్యార్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ కళాశాలల్లో కొత్త కోర్సుల ప్రవేశంపై అధ్యయనం చేయాలని సూచించారు. ఇదే సమయంలో జీవ ఇంధన రంగం అభివృద్ధికి కర్ణాటక-తెలంగాణ మధ్య భాగస్వామ్యం, సాంకేతిక సహకారం అవసరమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర బయోఎనర్జీ అభివృద్ధి మండలి ఛైర్మన్ ఎస్.ఈ. సుధీంద్రతో జరిగిన చర్చల్లో పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, పర్యావరణహిత స్థిర ఇంధన వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి సారించినట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!