

విజయవాడ–తిరుపతి విమాన ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి ఫ్లై91 నూతన విమాన సర్వీసును విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. బుధవారం గన్నవరం విమానాశ్రయంలో రిబ్బన్ కట్ చేసి సేవలను ప్రారంభించిన ఆయన, తొలి ప్రయాణికులకు స్వయంగా టికెట్లు అందజేశారు. వారంలో నాలుగు రోజుల పాటు ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
కొత్త సర్వీసుతో విజయవాడ–తిరుపతి మధ్య ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విమాన సర్వీసు ప్రారంభానికి సహకరించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం కూడా ఈ మార్గంలో విమాన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గన్నవరం నుంచి ఎమిరేట్స్, ఖతర్, లుఫ్తాన్సా వంటి అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. గత 12 ఏళ్లలో గన్నవరం విమానాశ్రయం గణనీయంగా అభివృద్ధి చెందిందని, భవిష్యత్తులో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!