

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ను ఉపయోగించి ప్రభుత్వ నియామక ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. బీటెక్ పూర్తి చేసిన రాహుల్ కుమార్ మీనా ప్రస్తుతం జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. 2024లో నిర్వహించిన అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్ పరీక్షలో పాల్గొన్న అతడు, ప్రొవిజనల్ ఎంపిక జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. తనకంటే ముందున్న అభ్యర్థుల కారణంగా ఉద్యోగం దక్కకపోవచ్చనే భయంతో అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తు ప్రకారం రాహుల్ చాట్జీపీటీ, గ్రోక్, డీప్సీక్ వంటి ఏఐ టూల్స్ను ఉపయోగించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక పోర్టల్లోకి చొరబడ్డాడు. అనంతరం తనతో పోటీ పడుతున్న అభ్యర్థుల పేర్లను ఎంపిక జాబితా నుంచి తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జాబితా నుంచి తొలగించబడినట్లు సందేశాలు అందుకున్న అభ్యర్థులు అధికారులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సైబర్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో రాహుల్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఖాళీ సమయాల్లో వివిధ వెబ్సైట్ల సర్వర్లను పరిశీలించడం తనకు అలవాటని అతడు విచారణలో వెల్లడించినట్లు సమాచారం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!