

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తూ కాలుష్య నియంత్రణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఆయన పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి జలాల్లో కలుషిత ప్రాంతాలను పరిశీలించారు. గోదావరిలోకి కలిసే మురుగు నీరు, వ్యర్థాల నిర్వహణపై పూర్తి స్థాయి ఆడిట్ చేపట్టాలని, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ‘కాలుష్యరహిత గోదావరి’ థీమ్తో వచ్చే ఏడాది పుష్కరాలను నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.
రోజుకు సుమారు 55 ఎంఎల్డీ మురుగు నీరు గోదావరిలోకి చేరుతున్న నేపథ్యంలో, దాన్ని శాస్త్రీయంగా శుద్ధి చేయాలని ఆయన సూచించారు. మురుగు నీటిని నేరుగా నదిలోకి వదలడం వల్ల జలాలు కలుషితం అవుతున్నాయని వచ్చిన ఫిర్యాదులపై దృష్టి సారించాలని చెప్పారు. పుష్కరాల నిధులను సమర్థవంతంగా వినియోగించి, ఆధునిక సాంకేతికతతో కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని ఆదేశించారు. పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్తో ముందుకు సాగి, గోదావరి తీరాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!