

ప్రజలపై ఆర్థిక భారం పెరగకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి మెట్రో ప్రాజెక్టులను అమలు చేసే ఆలోచనలో ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రులు, సీఎం మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రాజెక్టులకు రుణాలు తీసుకుంటే 10 నుంచి 12 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందని, కేంద్రంతో కలిసి పనిచేస్తే 2 నుంచి 4 శాతం వడ్డీకే రుణాలు పొందవచ్చని పేర్కొన్నారు.
తాడిచర్ల-2 బ్లాక్ కేటాయింపుపై సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, జాయింట్ వెంచర్గా ముందుకు వెళ్లడం ఉత్తమమని సూచించారు. మెట్రో విస్తరణకు సుమారు రూ.54,000 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. కేంద్ర సహకారంతో ఎఫ్ఆర్బీఎం పరిమితులు ఉండవని, వడ్డీ భారమూ తగ్గుతుందని చెప్పారు. ఈ అంశంపై తుది నిర్ణయం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీసుకుంటారని, కన్సల్టెంట్ నియామకం కారణంగా కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!