

రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం త్వరలో రెండు కరవు భత్యాలు (డీఏ) విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా ఈ అంశంపై సానుకూలంగా ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఈ నెల 18న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్న నేపథ్యంలో అదే రోజు డీఏలపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. గురువారం అసెంబ్లీలో ఉద్యోగుల ఐకాస నేతలు సీఎం రేవంత్రెడ్డిని కలిసి అరగంటపాటు చర్చించారు. పీఆర్సీ ప్రకటన, పెండింగ్ డీఏల విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఈహెచ్ఎస్ అమలు, ఉద్యోగ సంఘాలకు ఓడీ సౌకర్యం తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, అందులో మూడు డీఏలను అసెంబ్లీ సమావేశాల్లోనే విడుదల చేయాలని నేతలు కోరగా.. ఎన్ని డీఏలు పెండింగ్లో ఉన్నాయంటూ సీఎం ఆరా తీసినట్లు సమాచారం. ఆయన స్పందనను బట్టి త్వరలో రెండు డీఏలు విడుదలయ్యే అవకాశం ఉందని ఐకాస నేతలు పేర్కొన్నారు.
పీఆర్సీ నివేదిక అందిన తర్వాత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు ఐకాస తెలిపింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆర్థికశాఖతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి సమావేశమై పరిష్కార మార్గాలను ఖరారు చేస్తామని చెప్పారు. ‘మీరు ఎప్పుడైనా వచ్చి నన్ను కలవొచ్చు.. నా ఆఫీస్ రచ్చబండ. రాత్రి సమయంలో కూడా వచ్చి కలిసి మాట్లాడొచ్చు’ అని సీఎం పేర్కొన్నట్లు నేతలు తెలిపారు. పెండింగ్ బిల్లుల కోసం నెలకు రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని కోరగా, గత జనవరి నుంచి రూ.10 వేల కోట్లు విడుదల చేసినట్లు సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాదికి పెండింగ్లో ఉన్న ఓడీ సౌకర్యంపై కూడా సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఐకాస నేతలు వెల్లడించారు. అంతకుముందు ఐకాస ప్రతినిధులు రెండో పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కలిసి నివేదికను త్వరగా సమర్పించాలని కోరారు. ఈ నెల 15న ఆర్థికశాఖ అధికారులతో చర్చిస్తానని ఆయన చెప్పినట్లు నేతలు తెలిపారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!