

హిందూ వివాహ చట్టం కింద భారత్లో జరిగిన వివాహాలకు విదేశీ కోర్టులు మంజూరు చేసిన విడాకుల డిక్రీలు చెల్లుబాటు అవుతాయా అనే కీలక న్యాయ ప్రశ్నపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్. శ్రీధర్రెడ్డి 2003లో వివాహం చేసుకుని అనంతరం యూకేకు వెళ్లారు. భారత్లో విడాకుల పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత యూకేలోని కేంబ్రిడ్జ్ కోర్టు నుంచి 2014లో విడాకుల డిక్రీ పొందారు. అనంతరం మరో వివాహం చేసుకోవడంతో మొదటి భార్య బహుభార్యత్వం ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్ కేసు నమోదు చేయగా, ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరింది.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ శ్రీచంద్రశేఖర్ల ధర్మాసనం విచారణ సందర్భంగా హిందూ వివాహ చట్టం కింద జరిగిన వివాహాన్ని అదే చట్టం ప్రకారమే రద్దు చేయవచ్చని కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశీ కోర్టుల నుంచి విడాకులు తీసుకుని మరో వివాహం చేసుకునే పరిస్థితుల్లో భారతీయ మహిళలకు న్యాయం ఎలా జరుగుతుందనే అంశంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. యూకే కోర్టు డిక్రీని పరిగణనలోకి తీసుకోవాలని భర్త తరఫు న్యాయవాది వాదించగా, మధ్యవర్తిత్వాన్ని భార్య తిరస్కరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!