

టెక్ రంగంలో లేఆఫ్లు సాధారణంగా మారినప్పటికీ.. దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. TrueUp గణాంకాల ప్రకారం 2026లో ఇప్పటివరకు 1,75,000కు పైగా టెక్ ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. 2025లో మొత్తంగా 2,45,000కు పైగా టెక్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. సాంకేతిక రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు, కంపెనీల పునర్వ్యవస్థీకరణ, కృత్రిమ మేధ (AI)పై పెరుగుతున్న పెట్టుబడులు ఉద్యోగాల కోతకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఐటీ సేవలకు డిమాండ్ తగ్గడం, వ్యాపార వ్యూహాల్లో మార్పులు, ఖర్చులను తగ్గించుకోవడం, కొన్ని విభాగాల్లో బలహీన పనితీరు వంటి కారణాలు కూడా లేఆఫ్లకు దారితీస్తున్నాయి.
భారీగా ఉద్యోగాలను తగ్గించిన సంస్థల్లో ఒరాకిల్ ముందువరుసలో ఉంది. గత ఏడాది కాలంలో సుమారు 21,000 ఉద్యోగాలను తగ్గించినట్లు సమాచారం. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతానికి సమానం. యాపిల్ కూడా విజన్ ప్రో హెడ్సెట్ అభివృద్ధికి సంబంధించిన విభాగంలో కనీసం 60 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ సుమారు 4,800 ఉద్యోగాలకు లేఆఫ్ ప్రకటించగా, ఎక్స్బాక్స్లో 2027 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సుమారు 3,200 మంది ఉద్యోగులపై కోత ప్రభావం పడనుంది. వీసా తన మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 7 శాతం, అంటే సుమారు 2,600 ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు సమాచారం. ఉబర్ కస్టమర్ సర్వీస్ విభాగంలో సుమారు 10 శాతం, అంటే దాదాపు 3,400 ఉద్యోగాలను తగ్గించినట్లు తెలుస్తోంది. అమెజాన్ కూడా తన ఏఐ కార్యకలాపాల్లో కొన్ని ఉద్యోగాలను తగ్గిస్తోంది. మరోవైపు గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల్లో అధిక వేతనాలతో పనిచేసి లేఆఫ్కు గురైన సీనియర్ ఉద్యోగులకు సమాన స్థాయి కొత్త ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారిందని సమాచారం. దీంతో కొందరు వ్యక్తిగత బ్రాండ్లను అభివృద్ధి చేసుకుంటుండగా, మరికొందరు కన్సల్టింగ్ వ్యాపారాలు, స్టార్టప్ల వైపు అడుగులు వేస్తున్నారు. ఒరాకిల్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమవుతోందన్న వార్తలు టెక్ రంగంలో అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!