

వెనెజువెలా చమురు రంగంపై అమెరికా నియంత్రణ లేదా పునర్వ్యవస్థీకరణ జరిగితే, భారత చమురు కంపెనీలకు లాభం కలగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంతో వెనెజువెలాలో భారత కంపెనీలకు రావాల్సిన సుమారు 1 బిలియన్ డాలర్ల (రూ.9,000 కోట్లు) బకాయిలు వసూలయ్యే అవకాశముందని, అలాగే అక్కడ నిర్వహిస్తున్న చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తిని పెంచుకునే వీలుందని భావిస్తున్నారు. ఒకప్పుడు రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్లకు పైగా చమురును వెనెజువెలా నుంచి దిగుమతి చేసుకున్న భారత్, 2020 లో అమెరికా ఆంక్షల కారణంగా కొనుగోళ్లను నిలిపివేసింది. ఆంక్షలు సడలితే మళ్లీ దిగుమతులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
తూర్పు వెనెజువెలాలోని శాన్ క్రిస్టోబల్ చమురు క్షేత్రంలో 40 శాతం వాటా కలిగిన ఓఎన్జీసీ విదేశ్కు, ఆంక్షల కారణంగా ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో పాటు, దాదాపు 536 మిలియన్ డాలర్ల డివిడెండ్లు బకాయిగా ఉన్నాయి. ఆంక్షలు సడలితే గుజరాత్లోని ఓఎన్జీసీ క్షేత్రాల నుంచి రిగ్లు, పరికరాలు తరలించి, ప్రస్తుతం రోజుకు 5,000–10,000 బ్యారెళ్లకు పడిపోయిన ఉత్పత్తిని పది రెట్లు వరకు పెంచవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే వెనెజువెలాలోని ఇతర క్షేత్రాల నుంచి కూడా భారత కంపెనీలు ఉత్పత్తిని పునరుద్ధరించుకునే అవకాశం ఉంది.
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం, అమెరికా–వెనెజువెలా పరిణామాల ప్రభావం భారత వాణిజ్యంపై నామమాత్రంగానే ఉంటుందని పేర్కొంది. 2024–25 లో వెనెజువెలా నుంచి భారత్ దిగుమతులు కేవలం 364.5 మిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. భవిష్యత్తులో వెనెజువెలా చమురు ఎగుమతులు తిరిగి ప్రారంభమైతే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు స్థిరత్వం వచ్చే అవకాశముందని, అలాగే రష్యాపై ఆధారపడకుండా భారత్కు ప్రత్యామ్నాయ వనరుల నుంచి చమురు దిగుమతి చేసుకునే వెసులుబాటు లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!