
.jpeg&w=3840&q=75)
ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్కి చెందిన టెస్లా, భారత మార్కెట్లో విస్తరణకు మరో కీలక అడుగు వేసింది. బుధవారం గురుగ్రామ్లోని ఆర్కిడ్ బిజినెస్ పార్క్లో దేశంలోనే మొదటి ఫుల్-స్కేల్ రిటైల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది.
ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో, ఢిల్లీ ఏరోసిటీలో ఇప్పటికే ఉన్న చిన్న డిస్ప్లే సెంటర్లకి భిన్నంగా, ఈ కొత్త సెంటర్ను టెస్లా పూర్తి స్థాయి రిటైల్ అవుట్లెట్గా రూపొందించింది. ఇక్కడ కస్టమర్లు కార్లను పరిశీలించడంతో పాటు, బుకింగ్లు, టెస్ట్-డ్రైవ్లు కూడా చేసుకోవచ్చు. భారత మార్కెట్లో టెస్లా నిర్మాణాత్మక రిటైల్ నెట్వర్క్ ఏర్పాటుకు ఇది తొలి అడుగని కంపెనీ ప్రకటించింది.
ఈ కేంద్రానికి తాజాగా బాధ్యతలు స్వీకరించిన శరద్ అగర్వాల్ నేతృత్వం వహించనున్నారు. ఆయన గతంలో లంబోర్గిని ఇండియా హెడ్గా, ఆడి ఇండియాలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. భారత ఈవీ మార్కెట్లో టెస్లా ప్రీమియం బ్రాండ్ను బలోపేతం చేసేందుకే ఆయనను నియమించినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా అధికారికంగా భారత్లోకి ప్రవేశించి, దిగుమతి చేసిన రెండు Model Y వేరియంట్లను ₹59.89 లక్షలు, ₹67.89 లక్షల ధరల్లో అందుబాటులోకి తెచ్చింది. అయితే విక్రయాలు అంత ఆశాజనకంగా లేవు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్లలో టెస్లా మొత్తం 104 యూనిట్లు మాత్రమే విక్రయించింది.
ప్రస్తుతం టెస్లాకు స్థానిక తయారీ(లొకల్ మాన్యుఫాక్చరింగ్) ప్రణాళికలు లేవని, దిగుమతి కార్లు మరియు కొత్త షోరూమ్లపైనే దృష్టి సారించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, గ్లోబల్గా టెస్లా అమ్మకాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 2025 త్రైమాసికంలోనే కంపెనీ 4.97 లక్షల వాహనాలు డెలివరీ చేసి రికార్డు సృష్టించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!