

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తుండటంతో దేశీయ భీమా రంగానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 7.3 శాతానికి చేరుకునే అవకాశముందని అంచనా వేసింది. బలమైన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో ప్రజల సగటు ఆదాయాలు పెరిగి, భీమా పాలసీలకు డిమాండ్ మరింత పెరుగుతుందని తాజా నివేదికలో పేర్కొంది.
దేశీయంగా సానుకూల పరిస్థితుల ప్రభావంతో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్ కాలంలో మొత్తం భీమా ప్రీమియం ఆదాయం 17 శాతం పెరిగి రూ.10.9 లక్షల కోట్లకు చేరిందని మూడీస్ తెలిపింది. ఇందులో ఆరోగ్య భీమా ప్రీమియం 14 శాతం, జీవిత భీమా నూతన వ్యాపార ప్రీమియం 20 శాతం వృద్ధి సాధించాయి. అలాగే 2024–25 లో మొత్తం ప్రీమియం వసూళ్లు 7 శాతం పెరిగి రూ.11.9 లక్షల కోట్లకు చేరినట్లు విశ్లేషించింది.
వినియోగదారుల్లో భీమాపై అవగాహన పెరగడం, ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన డిజిటలీకరణ కారణంగా భీమా రంగంలో వృద్ధి మరింత వేగం పుంజుకుంటోందని మూడీస్ పేర్కొంది. ప్రభుత్వ రంగ భీమా సంస్థల లాభదాయకతను పెంచేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు, ఎల్ఐసీలో వాటా విక్రయం, మూలధన సాయం, కొన్ని సంస్థల విలీనం లేదా ప్రైవేటీకరణ వంటి ప్రతిపాదనలు రంగంపై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. అలాగే భీమా కంపెనీల్లో ఎఫ్డీఐ పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడం ద్వారా సంస్థలకు మరింత ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని మూడీస్ అభిప్రాయపడింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!