

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలపై ఇప్పుడు ఇంధన ధరల భారం మరింత పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) ధరలు గణనీయంగా పెరిగి, అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 115 శాతం పెరుగుదల నమోదైంది. అయితే ఈ పెంపు విషయంలో దేశీయ ఎయిర్లైన్లకు కేంద్ర ప్రభుత్వం కొంత ఉపశమనం కల్పించింది. దేశీయ సర్వీసులపై పూర్తి భారం మోపకుండా, కేవలం 8.5 శాతం మేర మాత్రమే పెంపును అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రతి నెలా అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ATF ధరలను సవరించే చమురు కంపెనీలు, తాజాగా భారీగా ధరలను పెంచాయి. దిల్లీలో కిలోలీటర్ ATF ధర రూ.96,638 నుంచి పెరిగి రూ.2,07,341.22కి చేరింది. అంటే ఒక్కసారిగా రూ.1,10,703.08 పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదలతో ATF ధర రూ.2 లక్షలు దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే దేశీయ ప్రయాణికులపై భారాన్ని తగ్గించేందుకు, కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఈ పెంపును దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం లీటర్కు రూ.15 చొప్పున పెంచుతూ, మొత్తం పెంపును 8.5 శాతానికి పరిమితం చేసింది.
విదేశీ మార్గాల్లో మాత్రం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి స్థాయి ధరల పెంపు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. మరోవైపు, విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో సుమారు 40 శాతం ఇంధన వ్యయాలకే వెచ్చించాల్సి వస్తోంది. ఇప్పటికే పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలను నడపడం వల్ల అదనపు ఖర్చులు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో పలు ఎయిర్లైన్లు టికెట్లపై ఫ్యూయెల్ సర్ఛార్జ్ విధిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ తాజా ధరల పెంపుపై ఎయిర్లైన్ల నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.




.jpeg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!