

ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత మార్కెట్పై ప్రభావం చూపే అవకాశముందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు, రవాణా వ్యయాలు పెరగవచ్చని, దాని ప్రభావం వినియోగదారులపై పడే అవకాశం ఉందని పార్లే ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా తెలిపారు. అయితే ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగదన్న ఆశాభావం తమకు ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు మారికో, డాబర్ వంటి ఎఫ్ఎంసీజీ సంస్థలు ఈ అంశంపై స్పందించడానికి ముందుకు రాలేదు. మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి మాట్లాడుతూ, పశ్చిమాసియాకు తమ ఎగుమతులు అధికంగా లేవని, అయినప్పటికీ పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు.
ఇదిలా ఉండగా, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం భారత వాణిజ్యంపై ఎలా ఉంటుందనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎగుమతిదారులతో కీలక సమావేశం నిర్వహించింది. ఎగుమతి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తినా వాటిని ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదే సమయంలో, విమాన రాకపోకలపై ఆంక్షల కారణంగా విమానాశ్రయాల్లో నిల్వవున్న సరుకులపై డెమరేజీ చార్జీలు మాఫీ చేయాలని దుస్తుల ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులకు తగిన ఉపశమనం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!