

దేశీయ స్టాక్ మార్కెట్లో కరెక్షన్ ధోరణి బుధవారం కూడా కొనసాగింది. రోజంతా అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించడంతో కీలక సూచీలు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 275 పాయింట్లు పడిపోయి 84,391 వద్ద ముగించగా, నిఫ్టీ 81 పాయింట్లు క్షీణించి 25,758 వద్ద ఆగింది. గత నెల 11 తర్వాత ఇరువురు సూచీలు ఇంత తక్కువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి.
మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ కరెక్షన్ కారణంగా బీఎస్ఈలో లిస్టెడ్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.8 లక్షల కోట్లు తగ్గిపోయింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలు పెరగడం, రూపాయి–డాలర్ మారకంలో రూపాయి బలహీనత, భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం పై ఇంకా ఉన్న అనిశ్చితి ఈ దిగివేతకు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవడం పెట్టుబడిదారుల సెంటిమెంట్ను మరింత దెబ్బతీసింది.
వడ్డీ రేట్ల పై అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం రాత్రి ప్రకటించే నిర్ణయం, అలాగే భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం పై రాబోయే అధికారిక ప్రకటన వీటితోనే మార్కెట్ దిశ నిర్ణయించబడే అవకాశం ఉందని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రీసెర్చి హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
ఇక ప్రముఖ బ్రోకరేజీ సంస్థ కోటక్ సెక్యూరిటీస్ మాత్రం దీర్ఘకాల దృష్టిలో మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. వచ్చే ఏడాది చివరికల్లా నిఫ్టీ 29,120 పాయింట్ల వరకు చేరగలదని ఆ సంస్థ ఎండీ మరియు సీఈఓ శ్రీపాల్ షా అంచనా వేశారు. కంపెనీల ఆదాయాలు 17 శాతం వరకు మెరుగవడం ఈ వృద్ధికి ముఖ్య కారకమని వివరించారు. భారత స్టాక్ మార్కెట్లో బుడగలు ఏర్పడుతున్నాయన్న అభిప్రాయాలను ఆయన ఖండించారు. అలాగే ఎఫ్పీఐలు వచ్చే ఏడాది మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!