

దేశంలో సెమీకండక్టర్ల, చిప్ల తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్ల కేటాయింపులతో ‘సెమీకాన్ 2.0’ పథకాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాల వివరాలను వెల్లడించింది. చిప్ తయారీ, అసెంబ్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.50 కోట్ల నుంచి రూ.20,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే సంస్థలకు 25 నుంచి 40 శాతం వరకు ఆర్థిక మద్దతు అందించనున్నట్లు తెలిపింది. దేశీయంగా సెమీకండక్టర్ పరిశ్రమను విస్తరించి, ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ఉంది.
సెమీకండక్టర్ డిజైనింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాలకు కూడా ‘సెమీకాన్ 2.0’లో ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించారు. పరిశోధన, అభివృద్ధి వ్యయంలో 75 శాతం వరకు ప్రోత్సాహకంగా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెమీకండక్టర్ రంగంలో నిపుణుల అభివృద్ధికి కూడా ఇదే స్థాయిలో మద్దతు ఇవ్వనున్నారు. దేశీయంగా ఓఎల్ఈడీ, మైక్రో ఎల్ఈడీ, ఎల్సీడీ టెక్నాలజీ డిస్ప్లేల తయారీకి పథకం సహకరించనుంది. అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తుల్లో వినియోగించే 3 నుంచి 7 నానోమీటర్ల సూక్ష్మ చిప్లను దేశంలోనే అభివృద్ధి చేయడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!