

న్యూఢిల్లీ:
భారత సిమెంట్ పరిశ్రమ మళ్లీ పుంజుకుంటోంది. గత మూడేళ్లుగా దేశీయ సిమెంట్ డిమాండ్ సగటున 9.5% చొప్పున పెరుగుతోందని రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది.
పెరుగుతున్న డిమాండ్ను తట్టుకునేందుకు కంపెనీలు ఉత్పత్తి సామర్థ్య విస్తరణ మరియు కొత్త ప్లాంట్ల ఏర్పాటు దిశగా భారీగా అడుగులు వేస్తున్నాయి.
వచ్చే మూడేళ్లలో ఈ రంగంలో ₹1.2 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు ప్రవహించనున్నాయని, ఇది గత మూడేళ్లతో పోలిస్తే 50% అధికం అని క్రిసిల్ అంచనా వేసింది.
2028 నాటికి 16–17 కోట్ల టన్నుల అదనపు సామర్థ్యం చేరనున్నదని పేర్కొంది. దీంతో ప్రస్తుత 66.8 కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 82.8–83.8 కోట్ల టన్నులకు పెరిగే అవకాశం ఉంది.
కొత్తగా చేరనున్న సామర్థ్యంలో 65% ఇప్పటికే ఉన్న ప్లాంట్ల విస్తరణ ద్వారా వస్తుందని, దీంతో పెట్టుబడి వ్యయాలు తక్కువగా ఉంటాయని తెలిపింది.
అదేవిధంగా, కొత్త పెట్టుబడుల్లో 10–15% సొంత ఇంధన అవసరాలకు ఉపయోగించే హరిత ఇంధన ప్రాజెక్టులు మరియు ఉత్పత్తి ఖర్చులు తగ్గించే చర్యలకు వెళ్తాయని క్రిసిల్ పేర్కొంది.
దీంతో కంపెనీల అప్పుల భారం స్థిరంగా ఉండి, లాభదాయకతకు ఎటువంటి పెద్ద ఇబ్బందులు ఉండవని తెలిపింది.
వచ్చే మూడేళ్లలో మౌలిక సదుపాయాలు మరియు గృహనిర్మాణ రంగాల్లో పెరుగుతున్న పెట్టుబడులు సిమెంట్ పరిశ్రమకు కీలక బలం కల్పించనున్నాయి.
అదానీ గ్రూప్కు చెందిన అంబుజా సిమెంట్, ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు పెద్ద ఎత్తున విస్తరణ చేపట్టాయి. కొత్త ప్లాంట్లతో పాటు చిన్న కంపెనీలను కొనుగోలు చేసి తమ స్థాయిని మరింత బలపరుస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలో ఉన్న 66.8 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంలో 85% మొత్తం 17 కంపెనీల చేతుల్లోనే ఉంది. గతంలో సగటు సామర్థ్య వినియోగం 65% కాగా, పెరిగిన డిమాండ్తో ఇది గత ఆర్థిక సంవత్సరంలో 70% కి చేరిందని క్రిసిల్ తెలిపింది.




.jpg&w=3840&q=75)







.avif&w=3840&q=75)


కామెంట్స్ (1)
భారత సిమెంట్ రంగం మళ్లీ వేగంగా పుంజుకుంటోంది!