

వేదాంతా గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తన ప్రతిజ్ఞను మరోసారి ధ్రువీకరించారు. తన సంపాదనలో 75 శాతాన్ని సమాజానికి దానం చేయాలని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని చెప్పారు. ఆయన కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ (49 ఏళ్లు) అమెరికాలో గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో అనిల్ అగర్వాల్ ఈ ప్రకటన చేశారు. అనిల్ అగర్వాల్ నికర సంపద 330కోట్ల డాలర్లు.
అగ్నివేశ్ స్కీయింగ్ యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో అనిల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'నా కుమారుడితో కలిసి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, మా సంపాదనలో 75 శాతం కంటే ఎక్కువను సమాజానికి ఇస్తాను. ఇకపై మరింత సరళ జీవితం గడుపుతాను' అని తెలిపారు. నా తనయుడు అగ్నివేశ్ ఎంతో త్వరగా మమ్మల్ని విడిచివెళ్లిపోయాడు. అతడి వయసు 49 ఏళ్లే. భవిష్యత్తు గురించి ఎన్నో కలలుండేవి. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదంలో గాయపడిన అగ్నివేశ్.. ఆసుపత్రిలో కోలుకుంటున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ కావడంతో మమ్మల్ని విడిచివెళ్లిపోయాడు.
జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా.. ఎంతో ఒదిగి ఉండేవాడు. ఒక ఫ్రెండ్లా నా వెంటే ఉండేవాడు. దేశం స్వావలంబన దిశగా పయనిస్తోందని బలంగా నమ్మేవాడు. మా సంపాదనలో 75 శాతం సమాజానికి తిరిగిస్తానని అగ్నికి వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను. అయితే, నువ్వు లేకుండా ఈ దారిలో ఎలా నడవాలో నాకు తెలియడం లేదు. కానీ నీ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను' అని అనిల్ అగర్వాల్ తన ఎక్స్ సందేశంలో రాసుకొచ్చారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!