

పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా మహిళల ద్వైపాక్షిక సిరీస్ జరగబోతోంది. జింబాబ్వే మహిళల జట్టు 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ల సిరీస్ల కోసం పాకిస్తాన్ను సందర్శించనుంది. ఈ సిరీస్ మహిళల క్రికెట్ అభివృద్ధిలో ఒక కీలక ఘట్టంగా నిలవనుంది. వచ్చే నెల 3 నుంచి 15 వరకు ఈ మ్యాచ్లు జరగనున్నాయి. వన్డే సిరీస్ ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ 2025-29లో భాగంగా ఉండగా, టీ20 సిరీస్ సాధారణ సిరీస్గా నిర్వహించబడుతుంది. అన్ని మ్యాచ్లు కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియంలో జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 3, 6, 9 తేదీల్లో వన్డేలు, వచ్చే నెల 12, 14, 15 తేదీల్లో టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి.
జింబాబ్వే తొలిసారిగా ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్లో పాల్గొంటుండటం విశేషం. ఈ సిరీస్ 2029 వరల్డ్కప్ అర్హతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ 8వ స్థానంలో, జింబాబ్వే 11వ స్థానంలో ఉన్నాయి. ఇటీవల పాకిస్తాన్ దక్షిణాఫ్రికాతో సిరీస్ కోల్పోయి ర్యాంకింగ్స్లో పడిపోయింది. అలాగే జింబాబ్వే న్యూజిలాండ్ చేతిలో పరాజయాలు ఎదుర్కొని అట్టడుగు స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈ సిరీస్లో మంచి ప్రదర్శనతో పాయింట్లు సాధించి తమ ర్యాంకులను మెరుగుపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. జింబాబ్వేతో సిరీస్ అనంతరం పాకిస్తాన్ ఐర్లాండ్లో జరిగే టీ20 ట్రై సిరీస్లో పాల్గొననుంది. ఇందులో వెస్టిండీస్ కూడా భాగం కానుంది. ప్రస్తుతం ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్ జట్లు టాప్-5లో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!