

తిరుపతి సభలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, పిల్లలకు విదేశీ సూపర్ హీరోలకే పరిమితం కాకుండా భారతీయ పురాణాల గొప్పతనాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటి పాత్రలకంటే మన పురాణాల్లోని మహానుభావులు ఎంతో గొప్పవారని, వారి చరిత్రను పిల్లలకు వివరించాలని సూచించారు. సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు అపారమైన బలానికి ప్రతీక అని, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్లకంటే అర్జునుడు గొప్ప యోధుడని చెప్పాల్సిన బాధ్యత మన పై ఉందన్నారు.
యువతకు శ్రీకృష్ణుని మహిమలు, శివుడి మహత్యం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో లేడని, రామరాజ్యం అంటే ధర్మం, న్యాయం, సమానత్వం ఆధారిత పాలన అని వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
అవతార్ వంటి సినిమాలకంటే భారత మహాభారతం, రామాయణాలు ఎంతో గొప్పవని పిల్లలకు చెప్పాలని సూచించారు. బకాసురుడు, కంసుడు వంటి రాక్షస పాత్రల ద్వారా మంచి–చెడుల మధ్య తేడాను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పవచ్చని తెలిపారు.
పురాణాలను ప్రజలు మరిచిపోతున్న సమయంలో ఎన్.టి. రామారావు ఎన్నో పురాణ గాథలతో కూడిన సినిమాలు చేసి, విలువలను ప్రజల్లో నాటిన మహా నాయకుడని చంద్రబాబు గుర్తు చేశారు. సినిమాల ద్వారా సామాజిక చైతన్యం తీసుకురావడమే కాకుండా, రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో విలువలు పాటించిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. దేశాభివృద్ధికి అటల్ బిహారి వాజ్పేయి బలమైన పునాదులు వేశారని, ప్రస్తుతం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
వినూత్న ఆలోచనలు చేయాలని, కొత్త ఆవిష్కరణలకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చిన సీఎం, భవిష్యత్తులో భారత్ తప్పకుండా సూపర్ పవర్గా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!