

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,32,205 కోట్ల భారీ వ్యయంతో బడ్జెట్ను రూపొందించినట్లు వెల్లడించారు. తన బడ్జెట్ ప్రసంగంలో 2019 – 24 మధ్య రాష్ట్రం తీవ్ర విధ్వంసాన్ని చవిచూసిందని పేర్కొంటూ, ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తోందని అన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందని, రాయలసీమ రైతుల కలలను సాకారం చేయడంతో పాటు శ్రీకాకుళం యువతకు నూతన ఉత్సాహం నింపుతుందని తెలిపారు.
బడ్జెట్ ప్రకారం ఆర్థిక లోటు రూ. 75,868.09 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 22,002.50 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లుగా నిర్ధారించారు. కేంద్ర పన్నుల వాటాగా రూ. 64,362 కోట్లు, పన్ను ఆదాయం రూ. 1,25,845 కోట్లు, పన్నుయేతర ఆదాయం రూ. 11,473 కోట్లు లభించనున్నట్లు అంచనా వేశారు. రూ. 30 వేల కోట్లతో హార్టికల్చర్ క్లస్టర్ల ఏర్పాటు, రాష్ట్రంలో ఆర్థిక జోన్ల స్థాపన వంటి కీలక నిర్ణయాలను ప్రకటించారు. గత ప్రభుత్వం రూ. 9.74 లక్షల కోట్ల అప్పు మిగిల్చిందని మంత్రి పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!