

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో రాష్ట్ర పరిస్థితులు ఆశించిన విధంగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. బెంగాల్లో రాజకీయ మార్పు అవసరమని, రాష్ట్రాన్ని బంగారు బంగ్లా గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ విషయాలను వెల్లడిస్తూ సోమవారం ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ సహకారం తక్కువగా ఉన్నప్పటికీ కేంద్ర పథకాలను ప్రజలకు అందిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. జన్ ధన్ యోజన ద్వారా సుమారు ఐదు కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించాం. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద 85 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని చెప్పారు. టీఎంసీ ప్రభుత్వం పేదల జీవనోపాధి పై ప్రభావం చూపుతోందని విమర్శించారు. అటల్ పెన్షన్ యోజన ద్వారా 56 లక్షల మంది వృద్ధులకు లాభం చేకూరిందన్నారు. ఉజ్వల యోజన కింద కోటి కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు అందించామని, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 52 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు.
దేశ ఆర్థిక దిశను నిర్ణయించగల శక్తి బెంగాల్కు ఉందని ఆయన పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ విధానాలు రాష్ట్ర అభివృద్ధి పై ప్రభావం చూపాయని విమర్శించారు. ఉపాధి అవకాశాల కొరతతో యువత వలస వెళుతోందని, మహిళలు భద్రత పై ఆందోళన చెందుతున్నారని చెప్పారు. స్వామి వివేకానంద, రిషి అరబిందో ఆశించిన బెంగాల్ ప్రస్తుతం హింస, ఓటు బ్యాంకు రాజకీయాలతో నిండిపోయిందని అభిప్రాయపడ్డారు. 2026 నాటికి రాష్ట్రాన్ని వికసిత్ బెంగాల్గా మార్చేందుకు ప్రజలు సంకల్పం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!