

దొరల గడీల ముందు మోకరిల్లనని ధైర్యంగా చెప్పిన కవి అందెశ్రీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో ‘అందెశ్రీ స్మృతివనం’ నిర్మాణానికి సీఎం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రముఖ కవి మరియు గాయకుడైన అందెశ్రీ తనకు ఆత్మబంధువని చెప్పారు. గత ప్రభుత్వం ఆయనను నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ, ప్రజా గాయకుడు గద్దర్ను కూడా ప్రగతిభవన్ వద్ద అవమానించారని ఆరోపించారు. ఈ ఘటనలతోనే ప్రజలు దొరలను తిరస్కరించాలనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఉద్యోగాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదని, అనేక మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గ్రూప్-1 నిర్వహించి, మొదటి ఏడాదిలోనే దాదాపు 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. కేసీఆర్ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టిందని ఆరోపిస్తూ, తెలంగాణ ప్రజలు వారికి మరోసారి అవకాశం ఇవ్వబోరని హెచ్చరించారు. రాష్ట్రాన్ని దోచుకోవాలనే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారని, అందెశ్రీ ఆత్మ మరోసారి ప్రేరణగా నిలుస్తుందని సీఎం వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!