

తెలంగాణ ఉద్యమం ఒక్కరోజులో పుట్టిన భావోద్వేగం కాదని, దశాబ్దాల పాటు కొనసాగిన ప్రజా ఆకాంక్షల ఫలితమని విమర్శకులు పేర్కొంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, స్వపరిపాలన, ప్రాంతీయ గౌరవం వంటి అంశాలపై విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కళాకారులు, మేధావులు కలిసి సాగించిన పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వారు గుర్తుచేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావాన్ని రాజకీయ తప్పిదంగా చూపించడం చారిత్రక వాస్తవాలను విస్మరించడమేనని అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్షలాది మంది త్యాగాలతో సాగిన ఉద్యమాన్ని వ్యక్తిగత భావోద్వేగాల స్థాయికి పరిమితం చేయడం సరైంది కాదని వారు అంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రజలు శాంతియుతంగా జీవిస్తూ, వ్యాపారాలు మరియు ఉద్యోగాలు కొనసాగిస్తున్నారని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నిరుద్యోగం, రైతు సమస్యలు, అమరావతి అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విమర్శకులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయడం ఆయన ప్రజాస్వామిక హక్కేనని పేర్కొంటూనే, ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే బాధ్యతాయుతమైన రాజకీయాలు, స్పష్టమైన వైఖరి, ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!