

మంగళంపేట అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ భూమి ఆక్రమణలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా హెలికాప్టర్లో అక్కడి పరిస్థితులను పరిశీలించడంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. పులిచెర్ల మండలం పరిధిలోని ఈ ప్రాంతంలో మాజీ అటవీశాఖ మంత్రి, వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబానికి సంబంధం ఉన్నట్లు చెబుతున్న 76.74 ఎకరాల అటవీ భూమి అక్రమ ఆక్రమణలో ఉన్నట్లు వెల్లడైంది. ఈ విషయంపై ఆధారాలతో కూడిన వీడియోను డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసి సంచలనం రేకెత్తించింది.
పవన్ కళ్యాణ్ ఇటీవల అటవీశాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, మొత్తం సుమారు 104 ఎకరాల అటవీ భూములపై సమీక్షించారు. ఈ భూములు కుటుంబ వారసత్వంగా వచ్చాయని చెప్పడం ఎలా సాధ్యం? అడవి మధ్యలో వ్యక్తిగత భూములు ఎలా ఏర్పడ్డాయి? ఎవరి పాత్ర ఎంత? ఈ విషయాలన్నింటిపై పవన్ వివరమైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే భూముల రికార్డుల్లో కూడా భారీ గందరగోళం ఉన్నట్లు ఆయన చూపారు. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం 45.80 ఎకరాలు మాత్రమే ఉన్నా, వెబ్ ల్యాండ్ రికార్డుల్లో అది 77.54 ఎకరాలుగా చూపడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. దీనిపై కూడా సమగ్ర విచారణ జరపాలని స్పష్టం చేశారు.
అటవీశాఖ అధికారులు ఇప్పటికే ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ (POR), ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఆక్రమణలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నామని, కేసులను కోర్టులో సమర్పించామని అధికారులు వివరించారు. ప్రజల ఆస్తులను దోచుకునే వారిపై కఠిన చర్యలు తప్పవు. ప్రకృతి వనరులను దోపిడీ చేసే వారు రాజకీయ మద్దతు పొందినా వదిలిపెట్టం, అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!