

రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన సాధించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ ఈ దిశగా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా, త్వరగా అందుబాటులోకి రావాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాలనా విధానాలు, నిబంధనలు మరింత సరళంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే కొన్ని చట్టాలను కూడా సవరించి సరళతరం చేసే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
సోమవారం తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, పరిపాలనలో ఆటోమేషన్కు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో డిజిటల్ అవగాహన పెంపు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సాంకేతిక సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా చెల్లింపులు లేదా ఇతర ప్రభుత్వ సేవల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 8.20 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు తమ విధులను సమర్థంగా నిర్వహించేలా సామర్థ్యాభివృద్ధి శిక్షణ పొందాలని సూచించారు. పలు సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల్లో అమలవుతున్న ఉత్తమ ప్రమాణాలను అన్ని కార్యక్రమాల్లోనూ అమలు చేయాలని అధికారులకు చెప్పారు. దీంతో ప్రభుత్వం పై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
అన్నా క్యాంటీన్లలో అందించే భోజనం రుచికరంగా, నాణ్యంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో ఆహార నాణ్యతను మెరుగుపరచాలని తెలిపారు. అన్ని వసతి గృహాల్లోనూ ఉత్తమ ప్రమాణాలతో భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
మహిళలపై నేరాల నివారణ కోసం విజిబుల్ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం చేపడుతున్న చర్యలను మీడియా ద్వారా ప్రజలకు నిరంతరం తెలియజేయాలని హోం శాఖకు ఆదేశించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!