.jpeg&w=3840&q=75)

జగిత్యాల ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను నేతలతో పంచుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీవన్ రెడ్డిని తాము ఎప్పుడూ తక్కువగా చూడలేదని, ఆయన గౌరవాన్ని తగ్గించేలా ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. 2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం తాము పూర్తిగా కృషి చేశామని సీఎం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించినప్పటికీ, ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కోరగా పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి సూచించిన వారికే టికెట్లు ఇచ్చామని తెలిపారు.
భవిష్యత్తులో ఆయనకు, ఆయన కుటుంబ రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చినా వినలేదని సీఎం అన్నారు. చివరికి మొండి పట్టుతో ఆయన పార్టీని వీడి, 40 ఏళ్లుగా ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను కూడా వదిలి, కేసీఆర్తో చేతులు కలిపారని విమర్శించారు. జీవన్ రెడ్డి వంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం బాధాకరమని వ్యాఖ్యానించారు.
జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఆయన కేసీఆర్ వద్ద తాకట్టు పెట్టారని సీఎం అన్నారు. ఆయన వయసుకు, అనుభవానికి ఇది తగదని పేర్కొన్నారు. తాను ఇప్పటికీ ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఏమీ మాట్లాడలేదని చెప్పారు. కుట్రలను తిప్పికొట్టేందుకు తాము ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన ప్రత్యర్థి శిబిరంలో చేరారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటే నిలబెట్టడం తప్పా అని ప్రశ్నించారు. తాను చేస్తున్నది మంచిదా చెడ్డదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని సీఎం అన్నారు. ఎవరు ఎవరో కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. పార్టీకి అండగా నిలబడాలని, మళ్లీ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ధైర్యంగా ఉండాలని, త్వరలోనే జగిత్యాలలో కార్యకర్తలను కలుస్తానని చెప్పారు. చివరగా వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు.










.jpeg&w=3840&q=75)







.jpg.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!