

తెలంగాణ శాసనసభలో విద్యా శాఖపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విద్యా విధానంపై సభలో చర్చ జరగడం శుభ పరిణామమని అన్నారు. సభ్యులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. విద్య ఒక్కటే జీవితాల్లో వెలుగును తీసుకువస్తుందని తాను పూర్తిగా నమ్ముతున్నానని చెప్పారు. తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్ను ఏర్పాటు చేశామని, కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు కేకే నేతృత్వంలో కమిటీని నియమించామని వెల్లడించారు.
విద్యా శాఖ బడ్జెట్ను గణనీయంగా పెంచామని రేవంత్ రెడ్డి తెలిపారు. 2023-24లో రూ.19,093 కోట్లుగా ఉన్న విద్యా బడ్జెట్ను 2026-27లో రూ.26,647 కోట్లకు పెంచామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 55 రోజుల్లో 10,006 మంది టీచర్ల ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విధానాన్ని తొలిసారిగా ప్రారంభించామని, ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులు ప్రీ ప్రైమరీ విద్యను పొందుతున్నారని తెలిపారు. విద్యార్థులకు పోషకాహారం అందించడంతో పాటు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోని ఉత్తమ విద్యా విధానాలను తీసుకొస్తామని రేవంత్ తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!