

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ మీసేవ సేవలకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ డిజిటల్ విధానం ద్వారా ఇప్పటివరకు 3.25 లక్షల మందికి వివిధ పౌర సేవలు అందించినట్లు వెల్లడించింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ వాట్సాప్ మీసేవలో మొత్తం 4.5 లక్షల మంది నమోదు చేసుకోగా, అందులో 3.25 లక్షల మంది ఇప్పటికే సేవలు పొందారు. ప్రజలు 24 గంటల పాటు 8096958096 అనే వాట్సాప్ నంబర్ ద్వారా సేవలను పొందవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పది కంటే ఎక్కువ శాఖలకు సంబంధించిన 581 రకాల సేవలను ఈ నంబర్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు.
కుల, ఆదాయం, జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం ఈ సేవలను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాగే మీసేవ దరఖాస్తుల స్థితి తెలుసుకోవడం, సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకోవడం వంటి అన్ని పనులు వాట్సాప్లోనే పూర్తవుతున్నాయని స్పష్టం చేసింది. దీని వల్ల మీసేవ కేంద్రాలకు పదేపదే వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలకు సౌలభ్యం కలిగిందని తెలిపింది.
ఈ వాట్సాప్ మీసేవ సేవలను 2025 నవంబర్ 18 న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రారంభించారు. డిజిటల్ పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారికీ సులభంగా ఉపయోగపడేలా ఈ సేవలను రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
అదేవిధంగా ఈ వాట్సాప్ మీసేవ ద్వారా 31 దేవాలయాలకు సంబంధించిన సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దర్శనం, వసతి సహా ఇతర సేవలన్నింటినీ వాట్సాప్ ద్వారానే బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. భవిష్యత్తులో 108, 101, 102 అత్యవసర సేవలను కూడా ఈ వాట్సాప్ నంబర్కు అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐదు వేలకుపైగా మీసేవ కేంద్రాల్లో రోజుకు 80 వేల నుంచి లక్ష మంది వరకు సేవలు పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. 2023 నవంబర్ 1 నుంచి 2026 జనవరి 31 వరకు మొత్తం 5.98 కోట్ల లావాదేవీలు జరిగాయని, వాటి విలువ రూ.3,811 కోట్లుగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!