

అమరావతిలో జరిగిన రాష్ట్ర ఉభయ చట్టసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మాణ దశను దాటి అభివృద్ధి దిశగా దృఢంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలుతో ఏటా రూ.33 వేల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా కింద 63.12 లక్షల మంది పింఛన్ దారులు లబ్ధి పొందుతున్నారని, తల్లికి వందనం కింద 66 లక్షలకు పైగా తల్లులకు సంవత్సరానికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 46.86 లక్షల మంది రైతులకు రూ.22 వేల కోట్ల సాయం, దీపం 2.0 ద్వారా 1.08 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని వెల్లడించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రూ.308 లక్షల కోట్లకు తీసుకెళ్లడం, తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు పెంచడం లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని గవర్నర్ తెలిపారు. పీ4 కార్యక్రమం కింద లక్ష మందికి పైగా మార్గదర్శులు 10.30 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నారని, లక్ష మంది మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, విశాఖ మరియు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను వేగవంతం చేయడం, అమరావతిని ఏఐ మరియు క్వాంటమ్ సాంకేతికతల కేంద్రంగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇటీవల జరిగిన పెట్టుబడి సదస్సుల ద్వారా లక్షలాది ఉద్యోగాలకు దారితీసే భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!