

హైటెక్ సిటీ హైదరాబాద్ రాష్ట్రానికి గేమ్చేంజర్గా మారినట్లే, అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్చేంజర్గా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతిలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ (AQV) భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచశ్రేణి ప్రమాణాలతో నిర్మించే ఈ క్వాంటమ్ వ్యాలీ భారత్ క్వాంటమ్ భవిష్యత్తును నిర్దేశించే కేంద్రంగా మారుతుందని తెలిపారు.
డిఫెన్స్, హెల్త్కేర్, ఎనర్జీ, ఫైనాన్స్, క్లైమేట్ మోడలింగ్ వంటి కీలక రంగాల్లో ఇక్కడ పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతాయని చెప్పారు. డ్రోన్ సిటీ, ఏరోస్పేస్, మెడ్టెక్, స్పేస్ సిటీ వంటి డీప్టెక్ రంగాలను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని, క్వాంటమ్ వేగంతో నిర్ణయాలు తీసుకుని పనులు పూర్తి చేసే వ్యవస్థను రూపొందిస్తున్నామని వివరించారు. త్వరితగతిన క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటుకు ముందుకొచ్చిన TCS, IBM, ఎల్ అండ్ టీ సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.
అమరావతిలో ఏఐ, క్వాంటమ్ ఏఐ కోర్సులు అందించే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చంద్రబాబు వెల్లడించారు. 2030 నాటికి లక్షల సంఖ్యలో క్వాంటమ్ నిపుణులు అవసరమవుతారని, యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ఏఐ మరియు క్వాంటమ్ సాంకేతికతల్లో శిక్షణ పొందితే ప్రపంచ స్థాయిలో ఏపీ యువత ముందుండగలరని ఆయన పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!