

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందరి దృష్టి క్వాంటమ్ టెక్నాలజీ పై ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిని ఆధునిక పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమరావతిలో ‘క్వాంటమ్ వ్యాలీ’ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
వేలాది మంది టెక్నాలజీ విద్యార్థులతో ఆన్లైన్లో నిర్వహించిన ‘క్వాంటమ్ టాక్’ కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. క్యూబిట్, వైసర్ సంస్థల సహకారంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు.
‘‘1970 లో చైనా ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. 1991లో భారత్ కూడా అదే దిశగా ముందడుగు వేసింది. ఆ సంస్కరణల తర్వాత దేశం వెనక్కి తిరిగి చూడలేదు. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేశాయి. హరిత విప్లవంతో దేశ స్థితిగతులు పూర్తిగా మారాయి. ఆహార ధాన్యాల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించింది’’ అని సీఎం గుర్తు చేశారు.
సామాన్యుల సాధికారతే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తోందన్నారు. ఇప్పటికే విశాఖపట్నం కు అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయని, భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి ఆ నగరం చిరునామాగా మారుతుందని తెలిపారు. అలాగే తిరుపతి లో ‘స్పేస్ సిటీ’ ఏర్పాటు దిశగా ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!