

మద్యం మత్తులో వాహనం నడిపే ఘటనలను తగ్గించేందుకు విజయవాడ నగర ట్రాఫిక్ పోలీసులు కొత్త చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జరిమానాలు, కౌన్సెలింగ్తోనే పరిమితం అయిన పోలీసులు, ఇకపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగుల వివరాలను వారి కార్యాలయ యాజమాన్యాలకు తెలియజేయాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో శిక్షల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిలో బాధ్యత పెరుగుతుందని భావిస్తున్నారు.
ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేపట్టిన ‘ఎరైవ్ ఎలైవ్’ కార్యక్రమంలో భాగంగా విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం, జి.కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధిక వేగం, మద్యం మత్తే ఎక్కువ ప్రమాదాలకు కారణమని పోలీసులు గుర్తించారు. నగర సీపీ రాజశేఖరబాబు, ట్రాఫిక్ డీసీపీ షిరీనా బేగం ఆదేశాల మేరకు మార్చి 1 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఉద్యోగానికి భంగం కలుగుతుందనే భయంతోనైనా మద్యం సేవించి వాహనం నడపకుండా ప్రజలు జాగ్రత్తపడతారని అధికారులు భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!