

కింగ్డమ్, వార్ 2 సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఆ సినిమాల రిలీజ్ల ముందు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చిన నిర్మాత నాగవంశి తీవ్రంగా ట్రోలింగ్కు గురైన సంగతి తెలిసిందే. సినిమాలు ఫెయిల్ అయ్యాక ఆయన ఆస్తులు అమ్మేశాడట, ఎవరికీ దొరక్కుండా దుబాయ్కి వెళ్లిపోయాడట అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వాటిపై సరదాగా స్పందించిన నాగవంశి, కొంత విరామం తీసుకుని మళ్లీ సినిమాలతో బిజీ అయ్యాడు.
ఇప్పుడు ఆయన నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రం మాస్ జాతర విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 31న పేడ్ ప్రీమియర్స్, ఆ తర్వాతి రోజు పూర్తి స్థాయి విడుదల జరగనుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశి మాట్లాడారు. గత అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఈసారి ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడారు.
“మాస్ జాతర”పై పూర్తి నమ్మకం ఉందని, ఇందులో రవితేజ అభిమానులు ఆశించే అన్ని అంశాలూ ఉంటాయని అన్నారు. కానీ ఈసారి సినిమా గురించి ఎక్కువగా చెప్పనని, “సూపర్ బంపర్ హిట్” అని చెబితే మళ్లీ సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ మొదలవుతుందని నవ్వుతూ చెప్పారు.
ఇక్కడే యాంకర్ సుమ మాట తీసుకుని, “మాస్ జాతర ఫుల్ మాస్, ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది” అని చెప్పడంతో నాగవంశి సరదాగా, “రిలీజ్ రోజున ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే సుమ గారి ఇన్స్టాగ్రామ్ పేజ్లో చేయండి, నా మీద కాదు!” అంటూ నవ్వులు పూయించారు.
మాట చివర్లో ఆయన సరదాగా, “ఏం జరిగినా ఈసారి దుబాయ్కి మాత్రం వెళ్లను. కాబట్టి ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు” అన్నారు. అలాగే రవితేజ సినిమాల్లో తనకు 'వెంకీ' మూవీ చాలా ఇష్టమని వెల్లడించారు.











కామెంట్స్ (1)
ఈసారి మాస్ జాతర హిట్ అవ్వాలి