

టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సారి రంగంలోకి దిగేది కొదమసింహం. కొద్ది నెలల క్రితం విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్కి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అయితే వైజయంతీ మూవీస్ ఎంతో కష్టపడి రీ మాస్టరింగ్ చేసినా, ప్రింట్ క్వాలిటీపై అసంతృప్తి వ్యక్తమైంది. నెగటివ్లు పాడైపోవడంతో పూర్వ కాంతిని తీసుకురావడం టీమ్కు కష్టమైంది. అయినా కూడా చిరు–శ్రీదేవి జోడి, ఇళయరాజా పాటలు, క్లాసిక్ స్టేటస్ సినిమాకు మళ్లీ థియేటర్లలో జనం రప్పించాయి.
ఇప్పుడు ఆ లోటును పూడ్చేందుకు కొదమసింహం నవంబర్ 21న రీ రిలీజ్కు సిద్ధమవుతోంది. ట్రైలర్ చూసినవారు క్వాలిటీ చూసి వావ్ అనక మానరని చెప్పాలి. ఆర్టిస్టుల హావభావాలు, బ్యాక్గ్రౌండ్, లైటింగ్ అన్నీ కొత్త తరహాలో మెరిసిపోతున్నాయి.
1990లో విడుదలైన ఈ కౌబాయ్ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద జస్ట్ యావరేజ్గా నిలిచినా, కాలక్రమేణా కల్ట్ క్లాసిక్గా మారింది.
సినీ విశ్లేషకులు ఈ సినిమాను తప్పక చూడాలని సిఫారసు చేస్తున్నారు. చిరంజీవి కౌబాయ్ స్టైల్, ఫైట్స్, డాన్సులు, రాజ్–కోటి పాటలు, కె. మురళీమోహన్ రావు దర్శకత్వం, దత్తు కెమెరా వర్క్ అన్నీ అద్భుతంగా కలసి వస్తాయి.
రాజమౌళి స్వయంగా వెల్లడించినట్లుగా, కొదమసింహం ఎడారి సీన్ నుండి స్ఫూర్తి పొంది మగధీరలో రామ్ చరణ్ గుర్రం సీన్ని రూపొందించారు.
మెగా అభిమానులకు ఇది నోస్టాల్జియా ఫీలింగ్ అయితే, సినిమా ప్రేమికులకు ఇది ఓ ప్రత్యేకమైన సినీ అనుభవం కానుంది.











కామెంట్స్ (1)
నవంబర్ 21కి మెగా ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి!