

సమాజంలోని వాస్తవాలను ప్రతిబింబించే విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో ఆసక్తికర ప్రాజెక్టుతో ముందుకు వస్తున్నారు. గతేడాది విడుదలైన ‘ఎమర్జెన్సీ’ చిత్రం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ (వర్కింగ్ టైటిల్). మనోజ్ తపాడియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కూడా నిజ జీవిత సంఘటనల ప్రేరణతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కంగనా ఒక నర్సు పాత్రలో కనిపించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
ముంబయిలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను వైద్య సిబ్బంది ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించారో ఈ చిత్రంలో చూపించనున్నారు. ఆసుపత్రి ఉద్యోగుల ధైర్యం, సేవాభావం ఈ చిత్రానికి ప్రధాన ప్రేరణగా నిలుస్తోంది. ఈ సినిమాలో మరాఠీ నటి గిరిజా ఓక్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!