

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రతరమవుతోంది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడులతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాంబు దాడుల నేపథ్యంలో యుద్ధ భయం మరింత పెరిగింది. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ ఎనిమిది దేశాల్లో ఉన్న అమెరికా బేస్ క్యాంపులపై దాడులు చేపట్టినట్లు సమాచారం. పరిస్థితుల దృష్ట్యా ఇరాక్, యూఏఈ, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేశాయి. జోర్డాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్న భారతీయులు, పర్యాటకులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది.
ఈ పరిణామాలు టాలీవుడ్లో కలకలం రేపాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ ఇటీవల జోర్డాన్లో కొనసాగింది. అయితే అక్కడి పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన చిత్ర యూనిట్ ఈ నెల 22కే తమ షెడ్యూల్ను పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగివచ్చింది. ఒకవేళ షూటింగ్ మరికొన్ని రోజులు కొనసాగి ఉంటే, ఎన్టీఆర్తో పాటు వందలాది మంది సిబ్బంది అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉండేది. ఈ షెడ్యూల్లో చిత్రానికి హైలైట్గా నిలిచే కీలక సన్నివేశాలు, ఎడారి ప్రాంతాల్లో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ డూప్ లేకుండా స్వయంగా స్టంట్స్ చేయడం విశేషం. ఒక మాస్ సాంగ్ను కూడా అక్కడే తెరకెక్కించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్ సురక్షితంగా హైదరాబాద్ చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో యుద్ధ పరిస్థితులు మరింత ప్రభావం చూపుతాయేమోనని ఆందోళన నెలకొంది. అయితే విదేశీ షెడ్యూల్ దాదాపు పూర్తవడంతో ఇక మిగిలిన చిత్రీకరణ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ తదితర భారతీయ లొకేషన్లలో జరగనుంది. దీంతో సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం ఉండదని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో తన కెరీర్లో ఎప్పుడూ కనిపించని కొత్త లుక్లో దర్శనమివ్వనుండగా, ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!