

తమిళ సినీ నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా విడుదల, సెన్సార్ సర్టిఫికెట్ అంశాలపై మద్రాస్ హైకోర్టులో దాదాపు మూడు గంటల పాటు వాదనలు జరిగాయి. అనంతరం చీఫ్ జస్టిస్ మహీంద్రన్ మోహన్ శ్రీవాత్సవ, జస్టిస్ జి. అరుళ్ మురుగన్లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేయగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఎఫ్సీ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. బోర్డు తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఆర్ఎల్ సుందరేశన్ వాదనలు వినిపిస్తూ, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సరైన సమయం ఇవ్వలేదని, అలాగే సినిమాను రివిజన్ కమిటీకి పంపాలన్న సమాచారాన్ని నిర్మాతలు అప్పట్లో సవాల్ చేయలేదని తెలిపారు.
నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది సతీశ్ పరాశరన్ వాదిస్తూ, యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాత, బోర్డులోని ఒక సభ్యుడి అభిప్రాయంతో ఆ నిర్ణయాన్ని మార్చిందని అన్నారు. సీబీఎఫ్సీ సూచనల మేరకు కొన్ని సన్నివేశాలు తొలగించినప్పటికీ, అదే సన్నివేశాలను మళ్లీ జోడించి తిరిగి తొలగించాలని కోరడం అన్యాయమని, కావాలనే సర్టిఫికెట్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!