

చికున్గున్యా అనేది ప్రధానంగా ఈడిస్ దోమల ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. వర్షాకాలంలో ఈ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. తీవ్రమైన కీళ్ల నొప్పులు, వాపు, బిగుతుతనం చికున్గున్యాలో ప్రధాన లక్షణాలు. ముఖ్యంగా చేతి మణికట్లు, వేళ్లు, చీలమండలు, మోకాళ్లు, పాదాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. అకస్మాత్తుగా జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, నీరసం, అలసట, చర్మంపై దద్దుర్లు కూడా కనిపించవచ్చు.
జ్వరం సాధారణంగా కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. అయితే కీళ్ల నొప్పులు, బిగుతుతనం మాత్రం వారాల పాటు కొనసాగవచ్చు. వృద్ధులు, ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలు ఉన్నవారిలో ఈ లక్షణాలు కొన్ని నెలల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. చికున్గున్యా, డెంగ్యూ ప్రారంభ లక్షణాలు ఒకేలా ఉండే అవకాశం ఉన్నందున ఖచ్చితమైన నిర్ధారణ కోసం వైద్యుల సలహా, అవసరమైన రక్త పరీక్షలు తీసుకోవడం ముఖ్యం.
డాక్టర్ల సలహా:
చికున్గున్యా నుంచి కోలుకునే సమయంలో తగినంత విశ్రాంతి తీసుకోవడం, ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం ముఖ్యం. తీవ్రమైన కీళ్ల నొప్పులు తగ్గిన తర్వాత తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయవచ్చు. పెయిన్ కిల్లర్స్ను వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. డెంగ్యూ లేదని నిర్ధారించుకునే వరకు యాస్పిరిన్, కొన్ని NSAIDs వాడకూడదు. వీటి వల్ల రక్తస్రావం ప్రమాదం పెరగవచ్చు.
గమనిక:
చికున్గున్యా, డెంగ్యూ లక్షణాలు ఒకేలా ఉండే అవకాశం ఉన్నందున సొంతంగా మందులు వాడకూడదు. జ్వరం మూడు, నాలుగు రోజులకు మించి కొనసాగినా, తీవ్రమైన కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బీపీ పడిపోవడం లేదా అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!