

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన తదుపరి సినిమా దర్శకుడు బాబీతో చేయబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' భారీ కమర్షియల్ హిట్ అయ్యింది. అందుకే ఈ కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో పెద్ద స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ జనవరి చివర్లో మొదలవ్వాల్సి ఉండగా, నిర్మాతకు వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల అది ఇంకా ప్రారంభం కాలేదు.
ఈ గ్యాప్లో మెగాస్టార్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ను లైన్లో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సుకుమార్ వద్ద చాలా కాలం పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీనివాస్కు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల శ్రీనివాస్ కథను చిరంజీవికి వినిపించగా, ఆ స్టోరీ లైన్ ఆయనకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా పల్లెటూరు బ్యాక్డ్రాప్లో తెరకెక్కబోతుందని చెబుతున్నారు. బాబీ సినిమా ఆలస్యం అయితే, ముందుగా ఈ సినిమానే ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన దర్శకులు ఇండస్ట్రీలో మంచి స్థాయికి ఎదిగారు. ఉదాహరణకు బుచ్చి బాబు , శ్రీకాంత్ ఓదెల వంటి వారు ప్రస్తుతం మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు శ్రీనివాస్ కూడా అదే దారిలో ఎదగవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా చిరంజీవి, బాబీ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో కూడా ఒక సినిమా చేయడానికి ఇప్పటికే ఒప్పుకున్నాడు. ఆ తరువాత శ్రీనివాస్తో మరో సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!