

విశాక గ్రూప్పై గురువా రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని విశాక గ్రూప్ చైర్మన్ మరియు మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. హెచ్సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) నుంచి ఇప్పటివరకు విశాకకు ఒక్క రూపాయి కూడా అందలేదని ఆయన స్పష్టం చేశారు. హెచ్సీఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కాకా వెంకటస్వామి సూచనల మేరకు తమ కుటుంబం స్టేడియం నిర్మాణానికి నిధులు సమకూర్చిందని తెలిపారు. అప్పటి హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్, ఏజీఎంలో విశాక పెట్టిన షరతులను అంగీకరించారని వెల్లడించారు.
2011లో ఐపీఎల్ హక్కుల వివాదం అనంతరం హెచ్సీఏ అప్పటి అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్ రూ.17 కోట్లు చెల్లించేందుకు ప్రతిపాదించారని, ఆ మేరకు హెచ్సీఏ-విశాక కలిసి కోర్టులో ఉమ్మడి అఫిడవిట్ కూడా దాఖలు చేశాయని వివేక్ తెలిపారు. అయితే ఆ ఒప్పందాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. గురువా రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికే డిఫమేషన్ నోటీసులు జారీ చేశామని, త్వరలో పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు చెప్పారు. టీసీఏ వెనుక పలువురు రాజకీయ నాయకులు ఉన్నారని ఆరోపించిన ఆయన, గ్రామీణాభివృద్ధి కోసం కాకా వెంకటస్వామి పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకునేందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!