

గర్ల్ఫ్రెండ్ సినిమాతో తనలోని బెస్ట్ పెర్ఫార్మర్ను బయటకు తీసుకొచ్చిన రష్మిక, కెరీర్ పరంగా ప్రస్తుతం పీక్స్ చూస్తోంది. విజయ్ దేవరకొండతో తన బంధాన్ని పరోక్షంగా బహిర్గతం చేస్తూ ఉన్నప్పటికీ, అధికారికంగా తమ పెళ్లి గురించి రష్మిక ఇంకా ఓపెన్ కాలేదు. బహుశా సరైన వేదిక, సరైన సందర్భం కోసం ఎదురు చూస్తుందేమో.
పెళ్లయిన తర్వాత అవకాశాలు తగ్గిపోవడం లాంటి విషయాలు లేవని సమంత వంటి వారు ఇప్పటికే నిరూపించారు కాబట్టి, ఆ విషయంలో అభిమానులు నిశ్చింతగా ఉన్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల జగపతిబాబు టాక్ షోకు గెస్ట్గా హాజరైన రష్మిక అక్కడ ఒక ఆసక్తికరమైన విషయం పంచుకుంది. స్పెషల్ సాంగ్స్ చేయాలంటే తన మనసులో ఉన్న నలుగురు దర్శకులు అడిగితేనే చేస్తానని ఆమె తెలిపింది.
వాళ్లు ఎవరో పేర్లు చెప్పకపోయినా, అభిమానులు రకరకాలుగా ఊహించుకుంటున్నారు. సుకుమార్తో ‘పుష్ప’ చేశారు కాబట్టి, ఆయన కాకపోవచ్చు. సందీప్ వంగాతో యానిమల్ రూపంలో బాలీవుడ్ బ్లాక్బస్టర్ సాధించినందున ఆయన కూడా కాదేమో. రాజమౌళితో ఇప్పటివరకు పని చేయలేదు కాబట్టి బహుశా ఆయనే ఫస్ట్ ఆప్షన్ అయి ఉండొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో కూడా ఇంకా అవకాశం రాలేదు. బాలీవుడ్లో రాజ్కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ వంటి వారు అడిగితే నో అనకపోవచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు.
మొత్తానికి రష్మిక మనసులో ఎవరు ఉన్నారన్నది పక్కనపెడితే, ఇక్కడ చెప్పిన కాంబినేషన్లు మాత్రం నిజంగా క్రేజీగా ఉన్నాయి.
ఇదిలా ఉంచితే, కేవలం ఇరవై రోజుల గ్యాప్లో రష్మిక రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. తమ్మ అనే హారర్ జానర్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా, గర్ల్ఫ్రెండ్ మాత్రం బోలెడు ప్రశంసలు అందుకుంది. కమర్షియల్గా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది. ప్రస్తుతం అనేక సెంటర్లలో కలెక్షన్లు బాగానే ఉన్నాయి.
తదుపరి తెలుగులో మైసా అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న రష్మిక, అది కూడా పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉంది. కెరీర్ పరంగా ఫుల్ హ్యాపీగా ఉన్న ఈ శ్రీవల్లీకి వచ్చే ఏడాది వ్యక్తిగత జీవితంలో జరగబోయే శుభకార్యం ఇంకెన్ని విజయాలు తీసుకురాగలదో చూడాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!