

ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ప్రతిష్ఠాత్మక 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) జాతీయ సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు నోవాటెల్లో జరిగే ఈ సదస్సు “ఇండియా–ది వరల్డ్స్ నెక్స్ట్ టూరిజం ఆపర్చునిటీ” అనే థీమ్తో నిర్వహించనున్నారు. బుధవారం నిర్వహించిన కర్టెన్ రైజర్ సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సదస్సు వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా టూర్ ఆపరేటర్లు, పర్యాటక రంగ ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు పాల్గొననున్న ఈ సదస్సుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఏపీలో బాధ్యతాయుతమైన, పర్యావరణహిత పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. 1,000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం, తిరుపతి, శ్రీశైలం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు, అరకు లోయ, గిరిజన సంస్కృతి, బౌద్ధ క్షేత్రాలు, సహజ సౌందర్యాన్ని అంతర్జాతీయ పర్యాటక పటంలో నిలపడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని చెప్పారు. ఏపీకి చెందిన అర్హులైన పర్యాటక భాగస్వాములకు సాధారణంగా ఉండే రూ.10,000 ప్లస్ జీఎస్టీ ఐఏటీఓ వన్టైమ్ అడ్మిషన్ ఫీజును 2026 డిసెంబర్ 31 వరకు రద్దు చేశారు. సదస్సు రిజిస్ట్రేషన్ ఫీజును కూడా రూ.3,000కు తగ్గించారు. సెప్టెంబర్ 13న ఐఏటీఓ సభ్యుల కోసం రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ఆరు ప్రత్యేక పోస్ట్ కన్వెన్షన్ టూర్లను నిర్వహించనున్నారు. బౌద్ధ, టెంపుల్ సర్క్యూట్లతో పాటు ప్రత్యేక ఉత్తరాంధ్ర టెంపుల్ సర్క్యూట్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలో రూ.5,529 కోట్లతో 16 పర్యాటక ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా సుమారు 10 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!